
అచ్చంపేట, వెలుగు: వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. షాపుల్లో స్టాక్, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఆమోదం పొందిన షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి, షాప్ లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే రైతులు, ప్రజలు పోలీసులు, వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట లైబ్రరీ చైర్మన్ రాజేందర్, మాజీ ఎంపీపీ రామనాథం, దర్గా కమిటీ అధ్యక్షుడు రఫీ, కో ఆప్షన్ మెంబర్ ఖాదర్ పాల్గొన్నారు.