- షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్
- సెగ్మెంట్ సమస్యలపై రంగారెడ్డి కలెక్టర్ కు వినతి
షాద్ నగర్,వెలుగు : కొత్తూరు మండలం సిద్ధాపూర్ లో ప్రభుత్వ భూ సేకరణలో అక్రమాలకు పాల్పడిన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలను తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. మంగళవారం షాద్ నగర్ ఆర్డీవో వెంకట మాధవ రావు తో కలిసి ఎమ్మెల్యే.. రంగారెడ్డి కలెక్టర్ శశాంకను కలిసి విన్నవించారు. సెగ్మెంట్ లోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సిద్ధాపూర్ భూ సేకరణ లో భూములు కోల్పోయి పరిహారం దక్కని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
షాద్ నగర్ లో డబుల్ ఇండ్ల కేటాయింపుల్లోని అక్రమాలను గుర్తించి సమగ్ర విచారణ చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టానుసారంగా గత ఎమ్మెల్యే అనుచరులకు ఇండ్లను కేటాయించారని ఆరోపించారు. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపికలు జరగాలని, నిజమైన అర్హులకు డబుల్ ఇండ్లు అందాలని కోరారు.
