
మొదటిసారి ఎమ్మె్ల్యేగా ఎన్నికైన డా. వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) తెలంగాణ అసెంబ్లీలో శనివారం (డిసెంబర్ 16న) ప్రసంగించారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని వర్గాల వాళ్లు అనాడు తెలంగాణ కోసం పోరాటాలు చేశారని చెప్పారు. తాము కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సమయంలో పార్లమెంటులో నినాదాలు, ధర్నాలు చేశామన్నారు. కాంగ్రెస్ ఎంపీలుగా తాము నిరసనలు చేపడుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ ఏనాడు తమను విమర్శించలేదని, వద్దని చెప్పలేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వాలో అనాడు ఉమ్మడి ఏపీ రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న గులాంనబీ ఆజాద్ కు చాలాసార్లు ప్రజెంటేషన్స్ ఇచ్చామన్నారు.
తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియమాకాలు వస్తాయని ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురుచూశారని, అయితే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ పాలనలో చాలా లోపాలు జరిగాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ తో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతున్నాయని గుర్తు చేశారు. మంచిర్యాల పట్టణంలో కూడా చాలా ఇండ్లు మునిగిపోతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖ రివ్యూ జరిపినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందని, దాదాపు 81 వేల కోట్లు రుణాలు ఉన్నాయని తేలిందన్నారు. అంతేకాకుండా.. రూ.50 వేల కోట్ల నష్టాల్లో ఉందని తేలిందన్నారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వ పాలన ఉండేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని నిర్బంధాలకు గురి చేశారని గుర్తు చేశారు. అక్రమ కేసులతో చాలామందిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. నియంతృత్వ పాలన పోవాలనే రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతిభవన్ ను ప్రజా భవన్ గా మార్చారని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం కూడా అమలు చేయడం మంచి పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని 90 శాతం ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. చాలా జిల్లాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం ఫెయిల్ అయ్యిందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 6 లక్షల కోట్ల అప్పుపాల్జేశారని చెప్పారు. జిల్లాల్లో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వలేదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రూ.5లక్షల సాయం అందిస్తామని కోరారు. ఇందిరాగాంధీ హయంలో జరిగిన పరిపాలన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోనూ పాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ వచ్చిన సమయంలో సింగరేణి సంస్థలో 62 వేల ఉద్యోగాలు ఉండేవని చెప్పారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వంతో అనాడు కొట్లాడి లక్ష ఉద్యోగాలు కాపాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం 39 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంటింటికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. సింగరేణి సంస్థలో చేపట్టిన కారుణ్య నియమాకాల్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం (బీఆర్ఎస్ పరిపాలనలో) సింగరేణి సంస్థకు కూడా అప్పు ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేసి, రాష్ట్ర ప్రజలకు వివరించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి.. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.