
- వారం రోజుల్లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
- బీఆర్ఎస్ హయాంలో నియంతృత్వ పాలన ఉండేది
- కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తున్నదని కామెంట్
ధర్మపురి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షలు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియంతృత్వ పాలన ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అందిస్తున్నదన్నారు.
తమ సమస్యలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిందని వివరించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ నాయకుడు గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. వీరికి ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, ఎండపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలు గృహలక్ష్మి స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు విప్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో యువ నాయకుడు గడ్డం వంశీ కృష్ణతో కలిసి పని చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ధర్మపురి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తర్వాత గడ్డం వంశీకృష్ణతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సెల్ఫీలు దిగారు.