రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్-) ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి మాన్యువల్గా సేకరించిన ఎన్యూమరేషన్ డేటాను, జీఐఎస్ కో-ఆర్డినేట్స్తో సహా ‘బీఎల్ఓ యాప్’లో డిజిటలైజ్ చేయాల్సి ఉంది.
డబుల్ ఓటర్లకు ‘అన్మ్యాపింగ్’ కఠినం
ఎవరైనా ఒకే వ్యక్తికి రెండు నియోజకవర్గాల్లో లేదా రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే, వారు ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు ఉంచుకోవాలి. ఒకవేళ కొత్త ప్రాంతంలో ఓటు కావాలనుకుంటే, పాత నియోజకవర్గంలో కచ్చితంగా ‘అన్-మ్యాపింగ్’ (ఓటు రద్దు) చేసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత ఓటు డిలీట్ అయినట్టు లేదా అన్-మ్యాప్ అయినట్టు సిస్టమ్లో అప్డేట్ అయితేనే, కొత్త యాప్ ఇక్కడి ఓటును అంగీకరిస్తుంది. చాలామంది హైదరాబాద్లోనూ, అటు సొంత గ్రామాల్లోనూ ఓట్లను అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు యాప్ ద్వారా డూప్లికేషన్ డేటాను ఈజీగా పట్టుకుంటుండటంతో, ఎక్కడో ఒకచోట రద్దు చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ అన్-మ్యాపింగ్ ప్రక్రియ ఆన్లైన్లో త్వరగా అప్డేట్ కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అవగాహన లేకపోతే వివరాలు రాయడం కష్టమే
మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారంలు నింపడం కూడా అంత ఈజీగా సాగడం లేదు. చదువుకున్న వాళ్లు సైతం ఎక్కడ ఏ వివరాలు నింపాలనే దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక చాలామంది బీఎల్ఓలకూ ఈ కొత్త యాప్, టెక్నాలజీపై కనీస అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. తగినంత శిక్షణ లేకుండానే అధికారులను ఫీల్డ్ వెరిఫికేషన్కు పంపడంతో, యాప్లో వచ్చే ఎర్రర్లను ఎలా పరిష్కరించాలో తెలియక వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడం, డేటా సింక్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో..పేర్లలో, డేట్ ఆఫ్ బర్త్ ఇతర తప్పులు ఉన్నోళ్లు జులై 31న విడుదల చేసే డ్రాఫ్ట్ రోల్ (ముసాయిదా జాబితా) విడుదలైన తర్వాత సరిచేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ : లిక్కర్ అమ్మితే జరిమానా
ఆగస్టు 1 –30 వరకు ఓటర్లు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో బీఎల్ఓలకు నేరుగా ఫామ్-8 ఇచ్చి, బీఎల్ఓ యాప్ ద్వారా లైవ్గా డాక్యుమెంట్లు స్కాన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించి, అన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత అక్టోబర్ 1 నాటికి పూర్తిస్థాయి స్వచ్ఛమైన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
