ప్రకృతి అందాలకు నిలయమైన కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటకులను కట్టిపడేసే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తిర్యాని మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న చింతలమాదర జలపాతం ప్రస్తుతం ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతోంది.
ఎత్తైన కొండపై నుండి విరజిమ్ముతున్న ఈ జలపాతం.. పైనుంచి కిందకు పడుతుంటే సరిగ్గా పాలధారలను మరిపిస్తోంది. చుట్టూ పచ్చని ప్రకృతి.. మధ్యలో తెల్లటి పాల నురగల్లా దూకుతున్న నీటి జలధారలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించడానికి రెండు కళ్లూ సరిపోవట్లేదంటూ పర్యాటకులు మురిసిపోతున్నారు. సెలవు రోజుల్లో ఈ జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
అయితే, పర్యాటకుల రద్దీ పెరుగుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. జలపాతం వద్దకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
