
పాలమూరు, వెలుగు: టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఓం కన్వెన్షన్ హాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎస్సెస్సీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. గతంలో డిగ్రీలో ఉన్న సిలబస్, ఇప్పుడు టెన్త్లో ఉందని, క్లిష్టమైన పాఠ్యాంశాలు పిల్లలకు నేర్పించేందుకు టీచర్లు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవాలని సూచించారు.
గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశామని, గత విద్యా సంవత్సరంలో నియోజకవర్గంలోని 43 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోర్డుల్లో కంటెంట్ ఫీడ్ చేశామని గుర్తు చేశారు. రెండేండ్లుగా టెన్త్ స్టూడెంట్లకు ఉచితంగా 2డి,3డి యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 10 శాతం విద్యార్థులు మంచి మార్కులు సాధించడం ముఖ్యం కాదని, మిగిలిన 90 శాతం విద్యార్థుల పరిస్థితి ఏమిటనే విషయంపై ఆలోచించాలని సూచించారు.
ఎక్కడ లోపం ఉందనే విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీతత్వంతో పని చేసి విద్యార్థులను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలోని పిల్లల కోసమే సీఎంపై ఒత్తిడి తెచ్చి ట్రిపుల్ఐటీని పాలమూరుకు తెచ్చుకున్నామని, టీచర్లు ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ తో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గోపనోళ్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.