
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. యూఐడీఎఫ్ కింద రూ.220.94 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ నిధులతో నగరంలో నీటి సరఫరాను మరింత మెరుగు పరుస్తామని, నీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. విద్య, రవాణా హబ్ గా మార్చుతామని, ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పట్టణం నుంచి రాయిచూర్, షోలాపూర్, గోవాకు వెళ్లే వారికి మెరుగైన సౌలతులు కల్పిస్తామన్నారు. నగరానికి మరో బైపాస్ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేయించామని చెప్పారు. సీఎం సహకారంతో ట్రిపుల్ఐటీ బ్రాంచ్ను రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, దీంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం పక్కకు పడేసిన అమృత్ స్కీంను పట్టాలెక్కిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి నగర జనాభా 5 లక్షలకు పెరిగే అవకాశం ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే సౌలతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లైబ్రరీ చైర్మన్ మల్లు నర్శింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఏఎంసీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, వినోద్ కుమార్, సీజే బెనహర్, కృష్ణయ్య పాల్గొన్నారు.