- ఫైల్స్ పట్టుకుని మంత్రులు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
- జనాల నుంచి నిలదీతలు, పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో కదలిక
- రోడ్లు , స్కూళ్లు , ఇతర డెవలప్మెంట్ పనులకు అప్రూవల్ కోసం తంటాలు
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ఏండ్లకేండ్లుగా పనులు పెండింగ్లో ఉండటం.. జనం నిలదీస్తుండటం.. పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారు. చిన్నచిన్న పనులైనా చేయించకపోతే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి స్వయంగా వారే ఆ పనులకు సంబంధించిన ఫైల్స్ను పట్టుకొని హైదరాబాద్లో మంత్రుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పనులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఏ మండలంలో ఏ హామీ ఇచ్చినం.. ఏ ఊరిలో ఏ పని పెండింగ్లో ఉంది.. అనే వివరాలను తెప్పించుకొని, వాటితో మంత్రుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇందులో ఎక్కువగా రోడ్లు, హాస్పిటల్స్(పల్లె దవాఖానలు), మన ఊరు–మన బడి కింద స్కూళ్లలో ఫండ్స్, మినీ స్టేడియం, నియోజకవర్గ కేంద్రాల్లో అర్బన్ పార్క్లు, ఫైర్ స్టేషన్లు, వెటర్నరీ హాస్పిటల్స్, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జూనియర్ కాలేజీల వంటివి ఉన్నాయి.
ముందు మంత్రుల వద్దకు వెళ్లి..!
తమ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రపోజల్స్ కాపీలను స్వయంగా ఎమ్మెల్యేలే పట్టుకుని వస్తున్నారు. ముందు సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్లి.. ‘‘నియోజకవర్గంలో తిరగలేకపోతున్నం అన్న! చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎట్లా’’ అంటూ ఫైల్స్ను మంత్రుల ముందు పెడుతున్నారు. ఉదయం వేళ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులను.. ఆ తర్వాత సెక్రటేరియెట్, ఆర్ అండ్ బీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో హెడ్లను కలుస్తున్నారు. ముందు మంత్రులతో ఫోన్ చేయించుకుని..ఆ తర్వాత సంబంధిత శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర అప్రూవల్ కోసం వెళ్తున్నారు. అయితే ‘‘ఫండ్స్ లేవు సార్.. శాంక్షన్ చేసినా పనులు మొదలుపెట్టే పరిస్థితి లేదు” అని ఉన్నతాధికారులు బదులిస్తున్నారు. ‘‘ఫస్ట్ అయితే అప్రూవల్ ఇవ్వండి.. తర్వాత సంగతి తర్వాత చూద్దాం’’ అని ఫైల్స్ను ఓకే చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్లో పని ముగించుకుని వస్తూ.. ‘‘మా సొంత ఫైళ్లు అనుకునేరు.. నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించినవి.. ఇవి కూడా మేమే పట్టుకుని తిరిగి చేయించుకోవాల్సి వస్తున్నది.. ఎలక్షన్ ఇయర్ కదా.. తప్పుతలే’’ అని తనను కలిసిన మీడియాతో అన్నారు.
ఊర్లల్లో నిలదీతలతోనే..!
ఎన్నికల ఏడాది కావడంతో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఊర్లలో జనాలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సర్వీస్ రోడ్లు, ప్రభుత్వ స్కూళ్లలో కొత్త క్లాస్లుల నిర్మాణం, పల్లె దవాఖాన్లు ఇతరత్రా వంటి వాటిపై నిలదీస్తున్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో 80 శాతం మందికి ఇదే అనుభవం ఎదురవుతున్నది. ఇదే విషయాలు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ప్రభుత్వానికి చేరుతున్నది. దీంతో తమ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని తేలితే.. మళ్లీ టికెట్కు ఇబ్బంది అవుతుందని, నియోజకవర్గంలో కొన్ని పనులన్నా చేయించుకుంటే కొంతలో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆఫీస్ల ద్వారా ఫైల్స్ వెళ్లే ఎప్పుడు ఓకే అవుతాయో తెలియదేని, అసలు అప్రూవల్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదని ఎమ్మెల్యేలే ఫాలో ఆప్ చేసుకుంటున్నారు.