
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా భౌగోళిక పరిస్థితులు, పరిశ్రమలు, జనాభా, రవాణా అవసరాలు, తదితర అంశాలను వారు మంత్రికి వివరించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుతో జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సాంకేతిక అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సర్వే చేయించాలని కోరారు. గతంలో సర్వే చేసినా ఆ తర్వాత పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో అధికార బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి కూడా ఉన్నారు.