
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చెయ్యాలని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
ఉపాధ్యాయ సంఘాలు తపస్, పీఆర్టీయూ టీఎస్, యూటీఎఫ్, ఎస్జీటీ సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపాయి. అనంతరం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 22 వేల మంది సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలన్నారు. రెగ్యులర్ చేసే వరకు టైం స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాశీరావు, పీఆర్టీయూ టీఎస్ నాయకుడు గోవర్దన్ యాదవ్, యూటీఎఫ్ గోపాల్, ఎస్జీటీ యూనియన్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.