కవిత కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం

కవిత కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం

జగిత్యాల జిల్లా: ఎమ్మెల్సీ కవిత కారుకు ప్రమాదం జరిగింది. గురువారం కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలం, రాజారాం  గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ అదుపుతప్పడంతో స్పల్ప రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కవితకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ.. సడెన్ గా కారు ప్రమాదానికి గురి కావడంతో వెనకాల వస్తున్న కాన్వాయ్ లోని 5 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత వేరే కారులో కవిత బయలుదేరి వెళ్లారు. కవితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కవిత గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు.  రాయికల్‌ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దొంగల మర్రి చౌరస్తాలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ కూడా ఆడారు. నాగాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం చేశారు. అలాగే ప్రసిద్దిపొందిన కొండగట్టు ఆంజనేయ స్వామినికూడా కవిత దర్శించుకున్నారు. తర్వాత కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.