తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు చేపడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కర్షకులను దెబ్బ కొట్టాలని చూస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వలేకపోతూ.. తెలంగాణ రైతులను కూడ ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను బీఆర్ఎస్ కాపాడుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని అన్నారు. వారికి మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూసి తాను షాక్ కు గురైనట్టుగా ట్వీట్లో ప్రస్తావించారు.
రేవంత్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న నిరసనలు
రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు జులై 12న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. విద్యుత్సౌధ ముందు ధర్నాలు నిర్వహించారు. రేవంత్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. వాళ్లకు కౌంటర్గా కాంగ్రెస్ ఇవాళ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది.