
రాష్ట్ర శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ వేశారు. డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులు అందరినీ.. మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తానన్నారు.
సమావేశం అనంతరం మండలి మీడియా పాయింట్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు అందరినీ తీసుకెళ్లడానికి అదేమైన టూరిస్ట్ స్పాటా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి తీసుకెళ్ళండని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. గవర్నర్ స్పీచ్ బాధాకరంగా ఉందని... జనాలు కూడా అదే బాధతో ఉన్నారని కవిత అన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. మండలిలో మాకు మెజార్టీ సభ్యులు ఉన్నా.. ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు తాను మండలిలో ఇచ్చిన అమైండ్ మెంట్ ను వెనక్కి తీసుకున్నాని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో చెప్పాలి కానీ.. గత ప్రభుత్వ పాలనపై ఎన్ని రోజులు మాట్లాడుతారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రక్షాన ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత చెప్పారు.