- పోలీసులను కోరిన ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్
- చంద్రబాబు, రేవంత్ భేటీ అయినట్టు అసత్య కథనం ప్రచురించారని ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని ‘ నమస్తే తెలంగాణ’ దినపత్రికలో అవాస్తవ కథనం ప్రచురించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ వార్తపై శనివారం ఆయన బేగంపేట ఎస్హెచ్వోకు ఫిర్యాదు చేశారు. పత్రిక యజమాని దీవకొండ దామోదర్ రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తిని విచారించి, వాస్తవాలు తెలుసుకోవాలని పోలీ సులను ఆయన కోరారు.
నిత్యం సీఎం రేవంత్పై కల్పితాలు, అవాస్తవాలు ప్రచురిస్తూ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ లాంజ్లో చంద్రబాబు, రేవంత్ 2 గంటల పాటు భేటీ అయ్యారని, ఏపీ ఎన్నికలకు తనకు ఆర్థికంగా సహాయం చేయాలని రేవంత్ ను బాబు కోరినట్లు వార్త పబ్లిష్ చేశారని ఫిర్యాదులో మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ ఆఫీసర్ల నుంచి పూర్తి సమాచారం తీసుకున్నామని, శుక్రవారం చంద్రబాబు 2.45 గంటలకు వచ్చి 3.0 7 గంటలకు వెళ్లారని, సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలకు వచ్చి 3.37 గంటలకు మెడికవర్ హాస్పిటల్ కు బయల్దేరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ పేపర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు పబ్లిష్ చేస్తూ జనాల్లో వారి పార్టీకి సానుభూతి రావాలని ప్రయత్నిస్తున్నదని గుర్తుచేశారు.