హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని..ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల కమ్యూనిజం బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టావా..ఇవ్వాళ అందరూ నిన్ను చీ కొడ్తున్నారన్నారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేశావన్న ఆయన...భూములు ఎలా తీసుకున్నావన్నారు. నీ ఆత్మ గౌరవం ఎక్కడ ఉందన్న ఆయన..ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను గౌరవించినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని గౌరవించలేదని తెలిపారు. ఎక్కువ పదవులు ఈటలనే అనుభవించారని..పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావని ప్రశ్నించారు. సొంత ప్రభుత్వం పథలకాలను హేళన చేశాడని..పార్టీ మీద నమ్మకం, నాయకుడి మీద విమర్శలు చేశాడన్నారు.
ఈటల క్షమించరాని నేరం చేశాడని.. దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటామన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సమయం చూసి మా అధినేత నిర్ణయం తీసుకుంటారని..నీ సమాధి నువ్వే కట్టుకున్నావు అన్నారు. ఏడేళ్ల పాలనపై విపక్షాలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని..ప్రతి ఎన్నికల్లో మేము చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగి అద్భుతమైన విజయం సాధిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ ఎస్ పాలనపై మాట్లాడ్తున్నారు.. మేము చేస్తున్న అభివృద్ధి పై ఛాలెంజ్ విసురుతున్నామన్నారు. రైతులు పండించిన పంటను కొంటున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.