ఎంఎంటీఎస్ రైళ్లు రెడీ ..రైల్వే శాఖ పర్మిషన్ ​కోసం వెయిటింగ్

ఎంఎంటీఎస్ రైళ్లు రెడీ ..రైల్వే శాఖ పర్మిషన్ ​కోసం వెయిటింగ్

సికింద్రాబాద్, వెలుగు : కరోనా ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా వర్క్ షాప్ కే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో, సిటీ బస్సులు పబ్లిక్​కి అందుబాటులోకి రావటంతో ఎంఎంటీఎస్ ను రైళ్లనూ నడపాలని స్థానిక రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైల్వే శాఖ నుంచి పర్మిషన్ రావడమే ఆలస్యం.. ట్రైన్స్​ నడిపేలా రిపేర్లు చేశారు. సిటిజన్స్​ కూడా ఎంఎంటీఎస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సర్వీసులు అందుబాటులోకి వస్తే  ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ప్రైవేట్​ఎంప్లాయ్స్, చిరు వ్యాపారులు, మిడిల్​క్లాస్ ​పీపుల్​ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్​కి ముందు సికింద్రాబాద్– లింగంపల్లి, హైదరాబాద్– లింగంపల్లి​,  ఫలక్​నుమా– హైదరాబాద్​రూట్లలో 121 ట్రిప్పులతో  డైలీ లక్షా70 వేల మంది ప్రయాణికులను ఎంఎంటీఎస్ రైళ్లు గమ్యస్థానానికి చేర్చేవి. ఆరు నెలలుగా నిలిచిపోవడంతో రైల్వే శాఖ కూడా డైలీ రూ.10 లక్షల ఆదాయం కోల్పోతోంది.

ఫేజ్ –2 ట్రయల్ రన్ 

ఎంఎంటీఎస్ ​బోగీలు, ఇంజిన్, వీల్స్, ఇతర మెషినరీని పూర్తిస్థాయిలో రిపేర్ చేశారు. బ్యాటరీలు, బ్రేకులు, వీల్ ​అలైన్​మెంట్లు చెక్​ చేసి పెట్టారు. మౌలాలిలోని ఎలక్ర్టికల్​మల్టీపుల్ ​యూనిట్​లో ఎంఎంటీఎస్ రైళ్లను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్​ ఫేజ్​–-2లో భాగమైన  సికింద్రాబాద్​– మల్కాజ్​గిరి, మేడ్చల్-– మౌలాలి  రూట్లలో ట్రయల్​ రన్స్​ నిర్వహిస్తున్నారు.