రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం

రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం

అవగాహన కార్యక్రమాలు చేపట్టినా…ప్రతీ ఏడాది లాగే…ఈ సారి కూడా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం రక్తసిక్తమైంది. దాదాపు 50 మంది గాయపడగా, నలుగురు తీవంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు ఏటా విజయదశమి రోజున ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడి చేసుకోవడం ఆచారంగా వస్తోంది.  నిన్న(మంగళవారం) జరిగిన కర్రల సమరం హోరాహోరీగా సాగింది. ఇలవేల్పు కోసం కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు.

ఈ ఆచారం హింసాత్మకంగా ఉండడంతో దీనిని అరికట్టేందుకు గత కొంతకాలంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్శించి అవగాహన కార్యక్రమాలను నెల రోజుల ముందు నుంచే చేపట్టినప్పటికీ సమరాన్ని మాత్రం అడ్డుకోలేక పోయారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనాలతో నిఘా పెట్టారు.