
వరుసగా మూడు సార్లు అధికారానికి దూరమై.. ఎన్డీఏ ప్రభుత్వంపై నిరవధిక పోరు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఎంపీ శశిథరూర్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రభుత్వ లోపాలను, ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలపై ఎప్పటికప్పుడు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది అగ్రనాయకత్వం. దీంతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో వంటి యాత్రలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవడం.. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం చేస్తూ వస్తోంది. అందులో కొంత మేర సక్సెస్ కూడా అయ్యింది.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అహర్నిశలు పని చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ చెప్పులో రాయిలా తయారయ్యారు. కాంగ్రెస్ నేతలు మోదీపై విమర్శలు చేస్తుంటే.. థరూర్ మాత్రం మోదీ సూపర్.. మోదీ నెంబర్ వన్.. మోదీ ఏం చేసినా కరెక్ట్ అని ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు అగ్రనాయకత్వం చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నట్లుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రత్యక్షంగా అగ్రనేతలు మాట్లాడలేదు.
కానీ తమ సైన్యంలో ఉండి శత్రు సైన్యం పాట పాడే థరూర్.. ఎప్పటికైనా ప్రమాదమేనని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే థరూర్ పై విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. ‘‘మాకు దేశమే ఫస్ట్.. కానీ కొందరికి మోదీ ఫస్ట్’’ అని బుధవారం (జూన్ 25) ఖర్చే చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
►ALSO READ | ప్రశాంత్ కిషోర్ పార్టీకి స్కూల్ బ్యాగ్ గుర్తు
ఇటీవల హిందూ పత్రికలో ఎంపీ శశి థరూర్ ఆర్టికల్ రాశారు. ఈ కాలమ్ లో మోదీ గురించి ‘‘ప్రపంచ స్థాయిలో మోదీ ఇండియాకు దొరికిన కీలక ఆస్తి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నేను ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేను. థరూర్ ఇంగ్లీష్ మాట్లాడే విధానం బాగుంటుంది. అందుకే అతడికి పార్టీ వర్కింగ్ కమిటీలో స్థానం ఇచ్చాం.’’ అని అన్నారు. పహల్గాం దాడి.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మొత్త ప్రతిపక్షం ఆర్మీకి మద్ధతుగా నిలిచిందని.. తామంతా ఆర్మీ వెనకే ఉన్నామని చెప్పారు.
‘‘మేను దేశం గొప్పది.. దేశమే ముందు అని అంటున్నాం.. కానీ ఒకరు మాత్రం దేశం తర్వాత.. మోదీనే ఫస్ట్ అంటున్నారు.. దాని గురించి మేమేం చేయాలి..?’’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. థరూర్ పై యాక్షన్ తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం భయపడుతుందా.. అనే ప్రశ్నకు.. ఆయన ఎలా అనుకుంటే అలా ఉంటుంది తమ నిర్ణయం అని చెప్పారు. మోదీపై ఆయన ప్రశంసలు వ్యక్తిగతమని అన్నారు.
ఖర్గే వ్యాఖ్యలపై థరూర్ వెంటనే స్పందించారు. ‘‘ఆకాశం ఎవరికీ చెందదు.. రెక్కలు మీవి.. ఎగరడానికి ఎవరినీ అనుమతి అడగొద్దు’’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.