మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయింది.. రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో సీఎం రేవంత్

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయింది.. రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో సీఎం రేవంత్

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గాం దాడి తర్వాత దేశం అంతా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని.. కానీ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందని.. గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని విమర్శించారు.

బుధవారం (మే 21) రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం రేవంత్. ఈ దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు. 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారని.. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి సొంతమని అన్నారు. 

ఇందిరా గాంధీకి ఉన్న తెగువ మోదీకి లేదు:

1971 పాకిస్తాన్ పై ఇందిరా గాంధీ యుద్ధం చేసి బలమైన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. పాక్ ను రెండు ముక్కలు చేసి శాస్వత గుణపాఠం చెప్పారని అన్నారు. భారత్ పై తీవ్ర వాద ముసుగులో దాడి జరిగితే ఇందిరాగాంధీ తెగువ గుర్తు చేసుకొస్తుందని అన్నారు.  దాదాపు 54 ఏండ్ల తర్వాత కూడా ఉక్కు మహిళ తెగువను ప్రపంచం గుర్తు చేసుకుంటుందని అన్నారు. 

గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారు:

తీవ్రవాదంపై పోరాడటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ కేంద్రానికి అండగా నిలిచామని.. క్యాండిల్ ర్యాలీతో తెలంగాణలో కేంద్రానికి మద్ధతుగా ర్యాలీ చేశామని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా కంగ్రెస్ తో పాటు ప్రజలందరూ అండగా ఉన్నప్పటికీ.. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి వచ్చిన అవకాశాన్ని మోదీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. 

పాకిస్తాన్ విషయంలో అమెరికాకు లొంగిపోయి వెనకడుగు వేసిన మోదీ.. గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచక్షణ కోల్పోయి రాహుల్  గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మొట్టమొదట కేంద్రానికి అండగా నలిచింది తెలంణ ప్రభుత్వమని. క్యాండిల్ ర్యాలీ తీసి కేంద్రానికి, బలగాలకు అండగా నిలిచామని అన్నారు. ఆ రోజు తాము చేసిన దానికి అభినందించడానికి నోరు కూడా రాలేదని విమర్శించారు. 

మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం అసువులు బాసారని, రాజీవ్ విగ్రహంపై సంకుచిత ఆలోచనతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు దేశం అంతా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దేశ ప్రజల హక్కులను, స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.