స్వాతంత్ర్య దినోత్సవం 2023 సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను అవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ... అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కేంద్రం రూ. 13వేల కోట్ల నుండి రూ. 15 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తుందని ప్రకటించారు. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందిన కళాకారుల కోసం వచ్చే నెలలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 25 వేలకు పెంచుతామని ప్రధాని మోదీ తెలిపారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా సామాన్యులకు దాదాపు రూ.20 వేల కోట్లు ఆదా అవుతుందన్నారు.
వచ్చే ఐదేళ్లలో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నామని, ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల కృషితో ఐదో స్థానానికి చేరుకున్నామని వెల్లడించారు. అంతకుముందు తన ప్రసంగంలో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రస్తావించారు. మణిపూర్ లో ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే త్వరలో అక్కడ శాంతి నెలకొంటుదని చెప్పారు. మణిపూర్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. దేశమంతా మణిపూర్ వెంటనే ఉందని తెలిపారు.