
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ‘‘పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వాళ్ల వెనుక ఉన్నోళ్లను కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ఆనాడు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే చేసి చూపించారు. ఆపరేషన్ సిందూర్తో పాక్, ఉగ్రవాదుల పని పట్టారు” అని చెప్పారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో సంబిత్ పాత్ర మాట్లాడారు.
ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 100% విజయవంతమైందని ఆయన తెలిపారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్ర స్థావరాలను మన ఆర్మీ నేలమట్టం చేసింది. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీనికి ప్రతిగా మనపై దాడి చేసిన పాకిస్తాన్కు ఆర్మీ తగిన బుద్ధి చెప్పింది. పాక్లోని 11 ఎయిర్బేస్లను ధ్వంసం చేసింది.
ఈ అటాక్స్లో 50 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయారు” అని వెల్లడించారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో భాగంగా కేంద్రం చేపట్టిన మిలటరీ, నాన్ మిలటరీ యాక్షన్ అద్భుతం. మన ఆర్మీ మొదటిసారి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో దాడులు చేసింది. అక్కడున్న టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. కేవలం 23 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసింది” అని చెప్పారు.
పాక్ ఏకాకి..
పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై మన ఆర్మీ చేపట్టిన దాడులను ప్రపంచ దేశాలు సమర్థించాయని సంబిత్ పాత్ర తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈ లాంటి ఇస్లామిక్ దేశాలు కూడా భారత్కు మద్దతుగా నిలిచాయని చెప్పారు. అంతర్జాతీయంగా పాక్ ఏకాకిగా మిగిలిందన్నారు. టెర్రరిస్టులకు అండగా నిలిచి, పాక్ మరోసారి తన పరువు తీసుకుందని మండిపడ్డారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై వస్తున్న ట్రోల్స్పై స్పందిస్తూ.. ‘‘మా పార్టీ.. సైనికులు, బ్యూరోక్రాట్స్ సహా అందర్నీ గౌరవిస్తుంది. సోషల్ మీడియా ఒక టూల్. దేశ కార్యాచరణను నిర్ణయించడానికి అది ఆధారం కాదు” అని పేర్కొన్నారు.