న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ ఆసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎంపీ మహ్మద్ అక్బర్ లోన్ మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగంలోని నిబంధనలను, దేశ సమగ్రతను కాపాడతానని పార్లమెంటు సభ్యునిగా చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్లు మహ్మద్ అక్బర్ లోన్ తన అఫిడవిట్లో వెల్లడించారు.
2018లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మహ్మద్ అక్బర్ 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు చేశారు. ఈ విషయం ఆర్టికల్ 370 రద్దుపై ఇటీవల చేపట్టిన విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి వచ్చింది. దాంతో భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ, దేశ సార్వభౌమాధికారాన్ని బేషరతుగా అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని మహ్మద్ అక్బర్ ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.