సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం (నవంబర్ 05) ప్రకటించిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన 35 ఏండ్ల షమీని టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం. షమీ ఇటీవల బెంగాల్ తరఫున మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో 93 ఓవర్లు బౌలింగ్ చేసి 15కు పైగా వికెట్లు తీశాడు. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నప్పటికీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచలేదు.
టీమిండియా సెలక్టర్ అజిత్ అగార్కర్ షమీ విషయంలో మాట తప్పాడు. షమీకి ఫామ్, ఫిట్ నెస్ ఉంటే ఖచ్చితంగా అతన్ని జట్టులో పరిగణిస్తామని అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే షమీ సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సెలక్ట్ చేయకుండా అతనికి బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బెంగాల్ టీమ్ తరఫున రంజీల్లో బరిలోకి దిగిన షమీ ఆసీస్తో వన్డేలకు సెలెక్ట్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. తాను ఫిట్గా ఉన్నానని.. ఒకవేళ ఫిట్నెస్ సమస్య ఉంటే రంజీ ట్రోఫీలో ఆడేవాడిని కాదన్నాడు. అలాగే, తన ఫిట్నెస్ గురించి సెలెక్టర్లు అప్డేట్ ఇచ్చే పని తనది కాదన్నాడు.
షమీ వ్యాఖ్యలపై అగార్కర్ స్పందించాడు. "తను నాతో నేరుగా ఆ విషయం చెబితే, నేను సమాధానం ఇస్తాను. నేను అతను చెప్పింది చదివితే ఫోన్ చేసి మాట్లాడతాను. గత కొన్ని నెలలుగా నేను షమీతో చాలాసార్లు మాట్లాడాను’ అని చెప్పాడు. టెస్ట్ క్రికెట్కు అవసరమైన సుదీర్ఘ స్పెల్స్కు షమీ శరీరం సహకరిస్తుందా? అనే విషయంలో సెలెక్టర్లలో ఇంకా సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఈ మధ్య షమీ తన ఫిట్నెస్ గురించి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కూడా అతని ఎంపికను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ సిరీస్ తర్వాత కనీసం ఆరు నెలల వరకు ఇండియా టెస్ట్ క్రికెట్ ఆడదు కాబట్టి, షమీ టెస్ట్ కెరీర్కు దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఆ తర్వాత ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది.
ఇండియా టెస్టు టీమ్:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
