- ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మద్దతుతో పదవి చేపట్టనున్న ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: అమెరికా–ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో రెండో కుమారుడు మొజ్తబా హొస్సేనీ ఖమేనీకి నాయకత్వ బాధ్యతలు దక్కాయి. మొజ్తబా ఖమేనీని దేశ తదుపరి సుప్రీం లీడర్గా అక్కడి ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ ఎంపిక చేసినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దీంతో 56 ఏండ్ల మొజ్తబా సుప్రీం లీడర్గా దేశ పగ్గాలను చేపట్టనున్నారు. అయతుల్లా అలీ ఖమేనీకి ఆయన రెండో కుమారుడు.
గత కొంతకాలంగా మొజ్తబా తండ్రి వారసుడిగా బాధ్యతలు చేపడుతారని విశ్లేషకులు భావిస్తూనే ఉన్నారు. అయితే, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ మొదటి నుంచీ వారసత్వ పాలనను విమర్శిస్తూ, రాచరికానికి తాము ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ వస్తున్నది.
ఇప్పుడు తండ్రి తర్వాత కుమారుడు పగ్గాలు చేపట్టడం ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది.
ఎంపిక విషయంలో ఐఆర్జీసీ ఒత్తిడి?
మొజ్తబా..1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. కోమ్లోని సెమినరీస్లో మత విద్యను అభ్యసించారు. క్లెరికల్ ర్యాంక్కు చేరుకున్నారు. అత్యున్నత ర్యాంక్ అయిన అయతుల్లాను అందుకోలేకపోయినా.. సుప్రీంలీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. మొజ్తబా ఎంపిక వెనుక ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఐఆర్జీసీ ఒత్తిడి ఉందని సమాచారం. మత గురువులతో కూడిన అసెంబ్లీపై ఒత్తిడి తెచ్చి మొజ్తబాను నాయకుడిగా ప్రకటించేలా చేశారని నివేదిక పేర్కొన్నది.
ఇరాన్ రాజకీయాల్లో, సైన్యంలో, ఆర్థిక వ్యవస్థలో ఐఆర్జీసీకి గట్టి పట్టు ఉన్నది. మొజ్తబాకు ఈ సైనిక విభాగంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.1980ల్లో జరిగిన ఇరాన్-–ఇరాక్ యుద్ధంలో మొజ్తబా పాల్గొన్నాడు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. మొజ్తబాకు సుప్రీం పదవి దక్కడానికి ఇదీ ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
