IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. అడుగుపెట్టగానే అప్పర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు పండగ..

IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. అడుగుపెట్టగానే అప్పర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు పండగ..

Monolithisch India IPO: కొన్ని నెలల విరామం తర్వాత మార్కెట్లలోకి ఐపీవోలు తిరిగి క్యూ కడుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు మళ్లీ బెట్టింగ్ వేసేందుకు భారీగా డబ్బులు సమకూర్చుకుంటున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం మెగా లిస్టింగ్స్ నమోదు చేయటం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మోనోలిథిష్ ఇండియా లిమిటెడ్ కంపెన ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ ఐపీవో షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఒక్కోటి 62 శాతం ప్రీమియం ధర రూ.231.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే దీని తర్వాత ఇన్వెస్టర్ల నుంచి షేర్ల కొనుగోలుకు డిమాండ్ పెరగటంతో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో తొలిరోజే కంపెనీ షేర్లు బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు 70 శాతం రాబడిని అందించి రూ.243.10 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.100 వరకు లాభం అందింది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.82.02 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇష్యూ సమయంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.135-143గా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 12న తెరచుకున్న ఐపీవో ఇన్వెస్టర్లకు 54లక్షల 48వేల షేర్లను విక్రయించింది. అయితే ఇన్వెస్టర్ల నుంచి వచ్చి భారీ స్పందనతో ఐపీవో 182.89 రెట్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ నమోదు చేసింది. ప్రధానంగా నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన లభించింది. 

కంపెనీ ఐపీవో లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు కనీసం రూ.లక్ష 43వేలు వెచ్చించాల్సి వచ్చింది. గ్రేమార్కెట్లో కూడా కంపెనీ షేర్లు సూపర్ ప్రీమియం ధరను సూచించాయి. అయితే చివరికి దానికంటే మెరుగైన లిస్టింగ్ నమోదైంది. 

కంపెనీ వ్యాపారం..
మోనోలిథిక్ ఇండియా ఆగస్టు 2018లో ప్రారంభించబడింది. ఈ కంపెనీ హీట్ ఇన్సులేషన్ రిఫ్రాక్టరీ స్పెషలైజ్డ్ 'ర్యామింగ్ మాస్'ను తయారు చేసి సరఫరా చేస్తుంది. దీనిని ఇనుము, ఉక్కు పరిశ్రమ ఇండక్షన్ ఫర్నేసుల్లో ఉపయోగిస్తారు. కంపెనీకి తయారీ యూనిట్ పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో ఉంది.