రాష్ట్రమంతా రుతుపవనాలు..2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ

రాష్ట్రమంతా రుతుపవనాలు..2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ
  • వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం
  • పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • జూన్ రెండో వారంలో మళ్లీ ఎండలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం నాటికి తెలంగాణ అంతటా విస్తరించాయి. సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు వ్యాపించాయి. తొలి రోజు 4 జిల్లాల్లోకి ఎంటరయ్యాయి. ఆ మర్నాడు కేవలం మహబూబ్​నగర్ వరకే విస్తరించాయి. బుధవారం నాటికి రాష్ట్రమంతా వ్యాపించాయి. 

ప్రస్తుతం రుతుపవనాలు చాలా యాక్టివ్​గా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని, రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. మిగతా 3 రోజులకు రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.

నారాయణపేట జిల్లాలో 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం

ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గుముఖం పట్టాయి. 40 డిగ్రీల్లోపే రికార్డ్ అవుతున్నాయి. అయితే, జూన్ రెండో వారంలో రుతుపవనాలకు తాత్కాలిక విరామం లభించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అప్పటికి భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే అవకాశాలు ఉండడంతో ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. కాగా, బుధవారం దక్షిణాది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. 

నారాయణపేట, మహబూబ్​నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వానలు పడ్డాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఊట్కూరులో 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 4.8 సెంటీ మీటర్లు, వికారాబాద్​లో 4.6 సెంటీ మీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్​లో 4.3 సెంటీ మీటర్లు, రంగారెడ్డి జిల్లా తొమ్మిదిరేకులలో 3.9 సెంటీ మీటర్లు, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాలలో 3.7 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.