ఆన్లైన్లో ఆర్డర్లు, రెస్టారెంట్లలో టేక్అవేకి డిమాండ్
మెయిన్ హోటళ్లకే ఎక్కువ గిరాకీ.. తక్కువ సిబ్బందితో పని
రెస్టారెంట్ బిర్యానీకి రెండు నెలలు దూరంగా ఉన్న జనం.. ఇప్పుడు మళ్లీ దానిని టేస్ట్ చేస్తున్నారు. లాక్డౌన్ రూల్స్ సడలించడం, రెస్టారెంట్లలో టేక్అవే, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు ఓకే చెప్పడంతో మళ్లీ రెస్టారెంట్ ఫుడ్డుకు డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో, ఇటు టేక్అవే ఆర్డర్లు క్రమంగా ఎక్కువవుతున్నాయి. మొదట్రెండు రోజులు డల్గానే ఉన్నా, ఇప్పుడు ఆర్డర్లు ఎక్కువగానే వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లకూ గిరాకీ పెరిగింది. అయితే, మామూలు రోజుల్లోలాగా ఇప్పుడు డెలివరీ బాయ్స్ అంత ఎక్కువగా లేకపోతుండడం, ఆర్డర్లు ఎక్కువగా వస్తుండడంతో ఇబ్బందులొస్తున్నాయి.
హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది బిర్యానీనే. దానికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రెస్టారెంట్కు వెళ్లినా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా చాలా మంది మనసు పడేది బిర్యానీపైనే. రెండు నెలలుగా హైదరాబాద్ బిర్యానీ రుచి తగలని జనం, ఇప్పుడు పసందైన ఆ బిర్యానీనే ఎక్కువగా తింటున్నారు. ఆర్డర్లు ఎక్కువగా దానికే పెడుతున్నారు. నిజానికి మాంసం తినేటోళ్లలో చాలా మంది వారంలో ఒకసారైనా బిర్యానీని టేస్ట్ చేస్తుంటారు. అయితే, లాక్డౌన్తో చాలా మంది ఇళ్లలోనే తయారు చేసుకున్నారు. ఇంట్లో తయారు చేసుకున్నా రెస్టారెంట్ బిర్యానీ టేస్ట్ మాత్రం రావట్లేదంటున్నారు బిర్యానీ ప్రియులు.
మెయిన్ రెస్టారెంట్లకే డిమాండ్
ప్రస్తుతం బిర్యానీకి ఫేమస్ అయిన పెద్ద పెద్ద రెస్టారెంట్లకే ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. పారడైజ్, బావర్చీ, షాగౌస్, కేఫ్ బాహర్, ఆదాబ్ ఎక్స్ప్రెస్ వంటి వాటితో పాటు పేరు పొందిన కొన్ని రెస్టారెంట్లకు ఆన్లైన్, టేక్అవే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కేవలం ఆన్లైన్, టేక్అవేకి మాత్రమే అనుమతి ఉండడంతో మామూలు రోజులతో పోలిస్తే సేల్స్ తక్కువగానే ఉన్నాయి. అయితే, తక్కువ స్టాఫ్తో పనిని నెట్టుకొస్తున్నాయి రెస్టారెంట్లు. మామూలు రోజుల్లో హోటల్ మెయింటెనెన్స్, వెయిటర్స్, స్వీపర్లు, చెఫ్లు, సర్వీస్ బాయ్స్ వంటి వాళ్లెందరో పనిచేస్తుంటారు. ఇప్పుడు కేవలం చెఫ్లు, సర్వీస్బాయ్స్తోనే రెస్టారెంట్లను నడుపుతున్నారు.