ఎన్నికల కోసం వరంగల్‌లో ఎడా పెడా శంకుస్థాపనలు

ఎన్నికల కోసం వరంగల్‌లో ఎడా పెడా శంకుస్థాపనలు
  • వరంగల్​ ఎన్నికల కోసం ఎడా పెడా శంకుస్థాపనలు
  • పనులు ఎక్కడియక్కడ్నే
  • ఇప్పటివరకు పూర్తయిన వర్క్స్​ 20 శాతమే

‘వరంగల్​లో రూ.2,578 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నం. రూ. 660 కోట్లతో కొత్త పనులు చేపడుతున్నాం. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి  ఆరు నెలల టైం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరుతున్నం. ఆరు నెలల లోపట మళ్లీ వరంగల్​కు వస్తే..  ఇది వరంగలా అని ఆశ్చర్యపడేలా డెవలప్​ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నం’ ...  ఏప్రిల్​ 12న మంత్రి కేటీఆర్​ టూర్​ సందర్భంగా వరంగల్​లో  ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పిన మాటలివి. 
ఆరు నెలల్లో ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయినా,  క్షేత్రస్థాయిలో 80 శాతం వర్క్స్​ పెండింగ్​లోనే  ఉన్నాయి.

 

వరంగల్​, వెలుగు:  గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు  నోటిఫికేషన్​రావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు మున్సిపల్​ మంత్రి కేటీఆర్​వరంగల్​లో పర్యటించారు. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 12న ఉదయం నుంచి రాత్రి దాకా సుడిగాలిలా సిటీని చుట్టేశారు. రూ.2,500 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  సిటీలో  రూ.660 కోట్లతో కొత్తగా  చేపట్టబోయే డెవలప్​ మెంట్​ వర్క్స్ కు శిలాఫలకాలు వేశారు. ఈ పనులను  ఆరు నెలల్లో కంప్లీట్​ చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పారు.  గ్రేటర్​ ఎన్నికల్లో  టీఆర్​ఎస్​ గెలిచింది. కానీ.. శంకుస్థాపనల్లో కనిపించిన స్పీడ్ పనుల్లో కనిపించలేదు. కొన్ని పనులు టెండర్​దశలో ఉంటే, మరి కొన్నింటికి అవసరమైన స్థలాల కేటాయింపు కూడా జరగలేదు. 

ఎలక్షన్ ముందు హడావుడి
మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ వరంగల్​ పర్యటన అంతకు ముందు మూడు సార్లు వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్​ రావడానికి నాలుగు రోజుల ముందు మాత్రం ఆయన సిటీకి రావడమే కాకుండా క్షణం తీరికలేకుండా తిరిగారు. ఎన్నికల్లో కీలక అంశమైన  డైలీ వాటర్​ సప్లై స్కీంను ఉగాదికి ముందు రోజే ప్రారంభించేశారు. భద్రకాళి బండ్, సుందరీకరించిన జంక్షన్లు, లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్​, బట్టల బజార్ ఆర్వోబీ, రైల్వే అండర్​ బ్రిడ్జి, పద్మాక్షి టెంపుల్​ వద్ద సరిగమ  పార్క్​, సెంట్రల్​ లైటింగ్​ సిస్టం లను కూడా ప్రారంభించారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన పనులను కేటీఆర్ ప్రారంభించేయడం లోకల్​ లీడర్లలో.. క్యాడర్​ లో జోష్​ నింపింది. దీంతో ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. 

ఆ ఊపు పనుల్లో కనిపించలేదు
ఈ టూర్​లో కేటీఆర్​ రూ.662కోట్లతో చేపట్టబోయే 30 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయితే గుంతల రోడ్లు, వరద ముంపు, తదితర సమస్యలు తీరుతాయని భావించిన నగర ప్రజల ఆశ నెరవేరలేదు. శంకుస్థాపనలు చేసినవాటిలో ఇంకా చాలా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వరంగల్ తూర్పులో జర్నలిస్ట్​ కాలనీ, సీబీసీ చర్చి డెవలప్​మెంట్​, సమ్మయ్యనగర్​ వద్ద నాలా ప్రొటెక్షన్​ వాల్, భద్రకాళి బండ్​ వర్క్స్​తప్ప మరేవీ టెండర్​ దశ దాటలేదు. కేవలం రూ.125.18 కోట్ల విలువైన పనుల్లో పురోగతి ఉండగా, మిగిలిన  రూ.535 కోట్ల పనులు  స్టార్ట్​ కాలేదు. 

రాంపూర్ డంపింగ్​ యార్డులో బయో మైనింగ్, సమ్మయ్య నగర్​లో వరద కాల్వ, నయీంనగర్​ నాలాపై హైలెవల్​ బ్రిడ్జి, శివనగర్​ నుంచి మైసయ్య నగర్​ వరకు స్ట్రోమ్​ వాటర్​ డక్ట్, ఆర్​ ఎస్​ నగర్​ నుంచి 12 మోరీ వరకు వరద కాల్వ, దసరా రోడ్డు జంక్షన్​ నుంచి ఉర్సు గుట్ట, కరీమాబాద్​ ఫ్లై ఓవర్​ నుంచి గవిచర్ల క్రాస్​ , వరంగల్​ ఫోర్ట్​ జంక్షన్​ నుంచి నాయుడు బంక్, లేబర్​ కాలనీ నుంచి సీకేఎం కాలేజ్​ రోడ్ల పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.  కొన్నిపనులకు సంబంధించి ల్యాండ్ ఇష్యూస్​ కూడా క్లియర్​ కాలేదు. రంగశాయిపేటతో పాటు ఐబీ గెస్ట్​ హౌజ్​ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు ఇంకా స్థలం కేటాయించలేదు. మార్కెట్ల నిర్మాణం మొదలు కావాలంటే ఇంకా చాలా టైమ్​ పట్టేలాఉంది. మంత్రి కోరిన గడువులో ఇంకా మిగిలిన రెండు నెలల్లోనైనా ఈ  వర్క్స్​ స్టార్ట్​ అవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇంకొన్ని హామీల్లోనే.. 
మంత్రి కేటీఆర్​ టూర్​లో భాగంగా వరంగల్​ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్​ పశ్చిమలో కూడా ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. వరంగల్​ ఫోర్ట్​ రోడ్డులోని 30 ఎకరాల  గ్రౌండ్​ ను వాకర్స్​ కోసం కొనుగోలు చేసి ఇస్తామని, ఇందుకు రూ.7 కోట్లయినా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్​ ఎయిర్​ పోర్టు, మెట్రోనియో ప్రాజెక్టు త్వరలోనే వస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వాటి ఊసే లేదు. ఇకనైనా పనులు స్పీడప్​ చేసి.. ఇచ్చిన మాట ప్రకారం నగర అభివృద్ధికి కృషి చేయాలని గ్రేటర్​ ప్రజలు కోరుతున్నారు.