ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కరోనా టెస్టులు

ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కరోనా టెస్టులు

అమరావతి, వెలుగు: ఏపీలో రోజువారీ టెస్టుల కెపాసిటీ 6 వేల నుంచి 10 వేలకు పైగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,292 మంది టెస్టులు చేయగా 67 మందికి పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 1,650కి చేరింది. కరోనా నివారణపై సోమవారం అమరావతిలో సీఎం జగన్ నిర్వహించిన రివ్యూలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో కరోనా టెస్టుల స్పీడ్ పెంచుతున్నామని, ప్రతి పది లక్షల జనాభాకు 2,345 టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం 1,093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 25, గుంటూరు 19, కృష్ణా 12, విశాఖపట్నం 6, కడప 4, చిత్తూరు జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.

కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే అనుమతి: జగన్

కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు, టూరిస్టులు, స్టూడెంట్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. స్పందన వెబ్‌‌సైట్‌‌ ద్వారా అప్లై చేసుకున్నవారి వివరాలు పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చేవాళ్లు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఆయా రాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్‌‌జోన్లో ఉన్నారా? ఆరెంజ్‌‌ జోన్లో ఉన్నారా? రెడ్‌‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు సేకరించిన తర్వాతే అధికారులు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదన్నారు.