హైదరాబాద్, వెలుగు: వానాకాలం కోసం రైతుబంధు పైసలు విడుదల చేసిన రాష్ర్ట సర్కారు.. పెండింగ్ పైసల విషయం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో గత ఏడాది రైతుబంధు రాని దాదాపు 23 లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2019–20 బడ్జెట్ లో రెండు సీజన్లకు కలిపి రూ.14 ,796 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాని రూ.10,532 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. రూ.4,250 కోట్లను పెండింగ్లో పెట్టింది. దీనిపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు గత ఏడాదికి సంబంధించిన పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన సర్కారు.. త్వరలో ఫండ్స్ విడుదల చేస్తామని చెప్పింది. కాని ఆ నిధుల విడుదల విషయంలో ఎలాంటి కదలిక లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి నుంచి రహస్యమే
రైతుబంధు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రహస్యంగానే వ్యవహరిస్తోందని విమర్శలు ఉన్నాయి. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు స్కీంలో అనధికారికంగా రూల్స్ అమలు చేస్తున్నారని, కోతలు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు సాయం ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. గ్రామంలో కొందరి రైతులకు అకౌంట్లలో డబ్బులు పడితే.. మరికొందరికి ఒక్క పైసా కూడా జమ కాలేదు.
రైతుల ఖాతాల్లోకే ట్రాన్స్ఫర్ చేయండి
వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష
రైతుల ఖాతాల్లోకే నేరుగా రైతుబంధు సొమ్ములు ట్రాన్స్ఫర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్ లో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో రైతుబంధు పంపిణీ పై గురువారం ఆయన సమీక్షించారు. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు రైతులందరికీ రైతుబంధు సొమ్ములు అందించాలని సీఎస్ కోరారు. ఈ మీటింగ్లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సీసీఎల్ఏ రజత్ కుమార్ షైనీ, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు.