
- జాడ లేని యాంటీ లార్వా ఆపరేషన్స్
- ఫాగింగ్ కూడా అంతంత మాత్రమే
- 8 నెలలుగా చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ ఖాళీ
- సగం ఫాగింగ్ మెషీన్లు పని చేస్తలేవ్
- మొత్తం పని చేస్తున్నాయని పెట్రోల్, డీజిల్ పక్కదారి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో దోమల బాధ ఎక్కువైంది. రోజూ రాత్రి కాకముందే తలుపులు, కిటికీలు మూస్తున్నా వాటి బెడద మాత్రం తగ్గడం లేదు. బల్దియాలోని ఎంటమాలజీ విభాగం యాంటీ లార్వా ఆపరేషన్స్ సరిగ్గా చేయకపోవడం, ఫాగింగ్ ను చేయకపోవడం వల్ల తెల్లవారేదాకా జనాలు దోమలను కొట్టుకుంటూ నిద్రకు దూరమవ్వాల్సి వస్తోంది. గతంలో ఏటా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సర్వే నిర్వహించి దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలతో పాటు గతంలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించేవారు. దోమల బ్రీడింగ్ పాయింట్లు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇలా గ్రేటర్ లోని 4850 కాలనీలను ఎంటమాలజీ డిపార్ట్ మెంట్పర్యవేక్షించేది ఈ సారి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు.
అసలు పోస్టు ఖాళీ..
బల్దియాలో దోమల నివారణకు కీలకమైన చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్టును 8 నెలలుగా ఖాళీ పెట్టారు. ఈ పోస్టులో ఉన్న రాంబాబు పదవీవిరమణ పొందగా, ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదు. దీంతో దోమలు నివారించడానికి యాక్షన్ ప్లాన్ లేకుండా పోయింది. ముందు జోరుమీదున్నట్టు కనిపించిన వర్షాలు ఇప్పుడు ముఖం చాటెయ్యడంతో దోమలు ఎక్కువయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే లార్వా నీటిలో కొట్టుకుపోయి దోమల బాధ తగ్గేది. కానీ, చిన్నపాటి వానలు, దంచుతున్న ఎండలతో సమస్య పెరిగింది. ఏటా జులై, ఆగస్టు నెలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతాయని, ఇప్పటికైనా పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని నగరవాసులు
భయపడుతున్నారు.
మూడు జోన్లలో తీవ్ర సమస్య..
గ్రేటర్లో ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. సికింద్రాబాద్ జోన్ లోని మల్కాజిగిరి, సికింద్రాబాద్ సర్కిల్స్ లోనూ ఇంతే..ఈ జోన్లలో ఫాగింగ్ తో పాటు యాంటీ లార్వా అపరేషన్లు జరగడంలేదు. సూపర్ వైజర్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్, సీనియర్ ఎంటమాలజిస్టులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరు కిందిస్థాయి వర్కర్లతో కోఆర్డినేషన్ చేసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కమిషనర్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫాగింగ్ చేయాలని ఆదేశించినా లైట్తీస్కుంటున్నారు.
దోమల నివారణకు రూ.21 కోట్లు..
బల్దియా పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి రూ.21 కోట్లు కేటాయించారు..150 డివిజన్లలో దోమల నియంత్రణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్లోని 2,375 సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 1800 మంది బస్తీలు, గల్లీలు, ఇండ్లకు వెళ్లి 1,817 ఫాగింగ్ మెషీన్లతో ఫాగింగ్ చేయాలి. కానీ, సగం ఫాగింగ్ మెషీన్లు పని చేయడం లేదు. ఎప్పుడో కొన్న మిషన్లు కావడంతో రిపేర్లు కూడా కష్టమేనని వర్కర్లంటున్నారు.
కొందరు ఎంటమాలజీ ఎస్ఈలు, సూపర్ వైజర్లు కుమ్మక్కై అన్ని మెషీన్లు పనిచేస్తున్నట్లు రికార్డుల్లో రాసి డీజిల్ నొక్కేసి బయట అమ్ముకుంటున్నారు. పైగా ప్రతి రోజూ బ్రహ్మాండగా ఫాగింగ్ చేస్తున్నామని ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. ఏరియాల వారీగా రిపోర్ట్ రాసి కమిషనర్ కు ఇస్తున్నారు. చెరువుల్లో దోమల లార్వాను కంట్రోల్ చేయడానికి డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తున్నామని చెప్తున్నా.. అందులో నిజం లేదని స్థానికులంటున్నారు.
పెట్రోల్, డీజిల్ స్వాహా..
ఎంటమాలజీ విభాగంలో డీజిట్, పెట్రోల్ మాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు బల్దియా కమిషనర్ డీజిల్, పెట్రోల్ కూపన్లకు బదులుగా క్రెడిక్ కార్డు తరహాలో కార్డులివ్వాలని నిర్ణయించారు. ఈ సిస్టం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. అల్వాల్ సర్కిల్లో ఓ ఆఫీసర్వర్కర్లకి ఎంతో కొంత డీజిల్, పెట్రోల్ఇచ్చి మిగతాదంతా నొక్కేస్తున్నాడు.
ఇక్కడ ఎనిమిది చిన్న మెషీన్లు ఉండగా ఫీల్డ్లోకి నాలుగే వస్తున్నాయని తెలిసింది. కానీ, 8 మెషీన్ల డీజిల్ వినియోగిస్తున్నామని చూపుతున్నట్లు తెలిసింది. ఫాగింగ్ కోసం పెద్ద మెషీన్లకు రోజూ 45 లీటర్ల డీజిల్, 5 లీటర్ల పెట్రోల్, చిన్న యంత్రాలకు తొమ్మిదిన్నర లీటర్ల డీజిల్, లీటరున్నర పెట్రోల్ కావాలి. కానీ, సగం కంటే ఎక్కువ పక్కదారి పట్టిస్తున్నారు. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం.