6 నెలల కూతురు మరణించిన కొద్ది రోజులకే తండ్రి కూడా

6 నెలల కూతురు మరణించిన కొద్ది రోజులకే తండ్రి కూడా

అశ్వారావుపేట, వెలుగు: అనారోగ్యంతో కూతురు, యాక్సిడెంట్​కు గురై తండ్రి 15 రోజుల వ్యవధిలో మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన పండా ముత్యాలరావు(26), రాధ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో చిన్న కూతురు(6 నెలలు) అనారోగ్యంతో 15 రోజుల కింద మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముత్యాలరావు ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్​తీసుకుని దురదపాడు నుంచి ఆసుపాక వెళ్తున్నాడు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రోడ్డు కన్పించక మామిళ్లవారి గూడెం దగ్గర రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రక్​ఊడిపోయి తిరగబడింది. ఇంజన్​అదుపు తప్పి సమీపంలోని వాటర్ ట్యాంక్ పిల్లర్​ను బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన ముత్యాలరావు స్పాట్​లోనే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. 15 రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.