స్కూల్​ ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

స్కూల్​ ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం  ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.  కొద్దిసేపటికే దవాఖానకు తరలించగా మరో బిడ్డ పుట్టింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి ఓ మహిళ ప్రసవ వేదన అనుభవిస్తుండగా చుట్టుపక్కల వారు గమనించారు. దగ్గరికి వెళ్లి చూసేసరికి అప్పటికే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 

దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై  విజయరావు, ఏఎన్ఎం రాధిక అక్కడికి వచ్చి ఆమెను వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పలేదు. మళ్లీ నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో ఆమెను 108 వాహనంలో అంతకుముందే పుట్టిన పాపతోపాటు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కొద్దిసేపటికే మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సదరు మహిళ ఎవరన్నది తెలియరాలేదు. ఆమె భాషను బట్టి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినది కావచ్చని భావిస్తున్నారు.