చనిపోయిన బిడ్డను కలిసి పుట్టినరోజు చేసిన తల్లి: వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

చనిపోయిన బిడ్డను కలిసి పుట్టినరోజు చేసిన తల్లి: వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

బిడ్డలపై అమ్మ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ సృష్టిలో మాతృమూర్తి మమకారానికి మించినది మరొకటి ఉండదు. తన పిల్లల కోసం ఏ స్వార్థం లేకుండా సకలం త్యాగం చేసే దేవత తల్లి. నవ మాసాలు మోసి.. తన ప్రాణాన్నే బిడ్డకు జీవంగా పోసి.. ప్రసవ సమయంలో చావును ఎదిరించి.. పేగు తెంచుకుని భూమిపై పడ్డ తన రూపాన్ని చూసుకుని రెండోసారి జన్మిస్తుంది అమ్మ. అలాంటి బిడ్డ తన కళ్ల ముందే పసి ప్రాయంలోనే ఏడేళ్లకే కన్నుమూస్తే ఆ తల్లి తట్టుకోగలదా? ఆ అమ్మ ప్రాణం పోసైనా మళ్లీ బతికించుకోవాలని అనుకుంటుంది. కానీ కాల ధర్మానికి తల వంచి.. పట్టెడు దు:ఖాన్ని దిగమింగుతుంది.

చనిపోయిన ఆ బిడ్డను మళ్లీ కలిసే అవకాశం వస్తే.. తన చిన్నారితో మంచి చెడు మాట్లాడగలిగితే.. తన బంగారు పాప పుట్టిన రోజును సెలబ్రేట్ చేయగలిగే.. ఏ మాతృమూర్తి అయినా సరే ఎంతో భావోద్వేగానికి లోనవకుండా ఉండలేదు. అన్నాళ్లుగా కడుపులో దాచుకున్న ఆ అమ్మ బాధ కన్నీటి ధారగా మారి.. చూసేవారిని సైతం నిలువెల్లా కరిగించేస్తుంది. కానీ, ప్రాణం పోయిన ఆ పసికందును మళ్లీ కలవడం ఎలా సాధ్యం? ఆ చిన్నారిని స్వర్గం నుంచి భువికి దించడం ఎలా? అని ఎవరికైనా అనుమానం రాకమానదు. వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీతో దీనిని సాధ్యం చేసింది ఓ కొరియన్ టీవీ.

ఏడేళ్ల వయసులోనే మరణించిన బిడ్డ

మున్‌హ్వా బ్రాండ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎంబీసీ) ‘ఐ మెట్ యూ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసింది. వీఆర్ టెక్నాలజీతో తల్లీబిడ్డలను కలపడమే ఆ డాక్యుమెంటరీ థీమ్. అందుకు కొరియాలోని జాంగ్ జీ సంగ్ అనే తల్లిని ఎంచుకుంది. ఆమె కూతురు నయాన్ ఓ జన్యుపరమైన అనారోగ్యం జలుబుతో మొదలై ఏకంగా ప్రాణం మింగేసింది. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు 2016లో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారిని బర్త్ డే నాడు కలిసి కొద్ది నిమిషాలు గడిపి, సెలబ్రేట్ చేసేలా కాన్సెప్ట్ డిజైన్ చేసింది. తన బిడ్డను మిస్సవుతున్న జాంగ్ ఈ షో కోసం అడగగానే ఒప్పుకొంది. నయాన్ ఫేస్, బాడీ, వాయిస్‌ను అలాగే డిజైన్ చేయడానికి ఎంబీసీ ప్రొడక్షన్ టీమ్‌కు ఎనిమిది నెలల సమయం పట్టింది. మొత్తం రెడీ అయ్యాక తల్లిదండ్రులు, వారి మరో ఇద్దరు పిల్లల్ని టీవీ యాజమాన్యం పిలిచి.. షూటింగ్ చేసింది.

తల్లి జాంగ్‌కు వీఆర్ సెట్ పెట్టి గ్రీన్ మ్యాట్‌పై నిలబెట్టారు. మిగతా కుటుంబం వెనుక వైపు టీవీ ఎదుట కూర్చున్నారు. జాంగ్ చిన్నగా ఎక్కడ నాన్నా అంటూ తన బిడ్డను పిలవగానే చిన్నగా అడుగులు వేస్తూ అమ్మా అంటూ తల్లి ఎదుటకు వస్తుంది. ‘నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా? అమ్మా’ అని అడుగుతుంది చిన్నారి. దానికి ఆ తల్లి కంటతడి పెట్టుకుంటూ ‘ప్రతి రోజూ నువ్వు గుర్తొస్తావు నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నాను’ అని చెబుతుంది. నిన్ను నా గుండెలకు హత్తుకోవాలనుంది కన్నా అంటూ విలపిస్తుంది. ఏడవకమ్మా అంటూ ఆ పాప తల్లిని ఓదారుస్తుంది. ఆ తర్వాత ఒక బల్లపై కూర్చుని ఆ తల్లి చిన్నారి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఈ డాక్యుమెంటరీని టీవీలో టెలికాస్ట్ చేశాక ఫిబ్రవరి 6న యూట్యూబ్‌లో పెట్టారు. ఆరు రోజుల్లోనే ఈ వీడియోను కోటి 13 లక్షల మంది చూశారు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా అమ్మ ప్రేమను అర్థం చేసుకోవడానికి భాషతో సంబంధం లేదని.. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టామని కామెంట్లు పెడుతున్నారు.