సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తానన్న వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ తుగ్గలో తొక్కిండని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2020-21 లోబడ్జెట్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రభుత్వం 10 వేల కోట్లు.. 21- 22 బడ్జెట్ లో 18 వేల 500 కోట్లు ప్రకటించి ఇండ్లు మాత్రం కట్టలేదన్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో 1821 మందికి 500 మంది ఉన్నారని.. అసలు హౌసింగ్ శాఖ ఎటు పోయిందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకంతో రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్లు వస్తాయని.. ఆవాస్ యోజన పథకం ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. డబుల్ బెడ్రూంలో అవినీతి సొమ్ము, కాలేశ్వరం అవినీతి సొమ్ముతో మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ జిల్లా శాఖలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా అధ్యక్షుడికి 40 లక్షలు ఇస్తారంట అని ఆరోపించారు.
తనకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమన్నారు అర్వింద్. జీవన్ రెడ్డి గెలుపులో తాను సహాయం చేస్తానని అంటున్నారని..అసలు తానేందుకు జీవన్ రెడ్డికి సహాయం చేస్తానని ప్రశ్నించారు. తాను తన తండ్రి మాటే వినలేదని.. జీవన్ రెడ్డి మాట ఎందుకు వింటానని అన్నారు అర్వింద్.
తన మీద పోటీ చేసే దమ్ము లేక కవిత మరో అభ్యర్థిని పెట్టి తనను ఓడిస్తారంట అని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో జైలుకు పోయిన మనీష్ సిసోడియాను కలిసేందుకు కవిత వెళతారని ఆరోపించారు. కవిత జైలుకు పోవాలని అందరు దేవుడిని మొక్కాలని కోరారు అర్వింద్.