మంత్రి కేటీఆర్కు ఎంపీ అర్వింద్ సవాల్

మంత్రి కేటీఆర్కు ఎంపీ అర్వింద్ సవాల్

కేంద్ర నిధులపై అవాస్తవాలు చెబుతున్నారంటూ ఎంపీ అర్వింద్  మంత్రి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై ఆయన వివాదాస్పద కామెంట్లు చేయడంపై మండిపడ్డారు. తంబాకు టెస్టుకు బండి సంజయ్ను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్న అర్వింద్.. కొకైన్ టెస్టుకు జుట్టు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. మనిషి పిచ్చికుక్కను కరిస్తే కేటీఆర్ లాగే ఉంటాడని సటైర్ విసిరారు. 

టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. అయ్యా కొడుకులది ఉత్త ప్రచారం మాత్రమేనని.. చేయని పనులు కూడా చేసినట్లు చెప్పి కేటీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డర ఖాన్ లను మిక్స్ చేస్తే కేటీఆర్ అవుతాడని అందుకే త్రిపాత్రాభినయం చేస్తున్నాడని అన్నారు. 111 జీవోకు తూట్లు పొడిచి జన్వాడాలో కట్టిన ఫాంహౌస్ ను కేటీఆర్ కూల్చివేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు
తెలంగాణలో బియ్యం బ్లాక్ మార్కెట్ పై సీబీఐ విచారణకు ఎన్ఓసీ ఇచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా అని అర్వింద్ ప్రశ్నించారు. బండి సంజయ్ పాలమూరులో యాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేసిన కేటీఆర్.. తన నియోజకవర్గం సిరిసిల్లను వదిలి హనుమకొండలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని.. ఈ మాట నూటికి నూరుశాతం నిజమవుతుందని అన్నారు.