త్వరలోనే  ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్ కుమార్​రెడ్డి

త్వరలోనే  ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్ కుమార్​రెడ్డి

జనగామ, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారు. గురువారం జనగామ డీసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​ రెడ్డితో కలిసి సీఎంఆర్ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. తమకు మరో మూడున్నరేళ్ల టైమ్​ఉందని, ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. 

ఏడాదిన్నరకే కొంప మునిగినట్లు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోందని 

విమర్శించారు. గత పాలన అంతా కేసీఆర్​ ఫాంహౌస్​చుట్టే నడిచిందన్నారు. ప్రజలు డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై మాట్లాడారని పేర్కొన్నారు. బీఆర్ఎస్​ లీడర్లు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.

రైల్వే అభివృద్ధి పనులు స్పీడప్​చేయండి

జనగామ రైల్వే స్టేషన్​అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి ఆదేశించారు. గురువారం పనులను పరిశీలించిన అనంతరం రైల్వే డీజీఎం ఉదయ్ తో ఫోన్​లో మాట్లాడారు. 2022లో ప్రారంభమైన సుందరీకరణ పనులు నేటికీ ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించగా వచ్చే నవంబర్ లోగా కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఢీజీఎం చెప్పారన్నారు. యూత్​ కాంగ్రెస్​ స్టేట్​​ లీడర్​కొమ్మూరి ప్రశాంత్​ రెడ్డి, నాయకులు మెరుగు బాలరాజు, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.