వనపర్తి/మదనాపురం, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆత్మకూరు, అమరచింత మండలంలోని మూలమల్ల గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అమరచింత మండల కేంద్రంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారు నుంచి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతాయని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనే బీజేపీని ఆదరించాలని ప్రజలను కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
మహబూబ్ నగర్, : నారాయణపేట చేనేత చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, మరింత నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ చీరలను నేసి వ్యాపారం పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్ లో చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకంలో భాగంగా 72 మంది చేనేత కార్మికులకు మగ్గలు, చేనేత అధునాతన యంత్రాలు, పరికరాలు జక్కడ్స్, ఫ్రేమ్ లూన్, వైడింగ్ మిషన్, ఫిర్కం డబ్బా, ఫిట్ లను శనివారం ఆమె పంపిణీ చేశారు.
