
24 గంటల కరెంట్ ఏడిస్తున్నరు?
కేటీఆర్ను ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సబ్ స్టేషన్కు వెళ్లి చెక్ చేద్దామని సవాల్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం బూటకమని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనీసం 10 గంటలైనా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ సబ్స్టేషన్కు వెళ్లినా ఈ విషయం తెలుస్తుందని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి కేటీఆర్ ఏ సబ్స్టేషన్ అంటే అక్కడికి వెళ్లేందుకు సిద్ధం. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఎక్కడైనా ఓకే. కేటీఆర్ సిద్ధమా?” అని సవాల్ చేశారు.
ఎక్కడా పది గంటలు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. సబ్స్టేషన్ లాగ్బుక్కులు ఓపెన్ చేస్తే ఆ విషయం తేలిపోతుందని చెప్పారు. ఒకవేళ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని తేలితే తాను ఆ సబ్స్టేషన్ వద్దే రాజీనామా చేస్తానని, ఒకవేళ ఇవ్వకుంటే కేటీఆర్ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాగా, దేశాన్ని కలిపి ఉంచేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని, అలాంటి వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు బనాయించిందని ఆయన మండిపడ్డారు.