
సిద్దిపేట రూరల్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఉందా..? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చాలెంజ్ చేశారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల సమీపంలోని ముదిరాజ్ హాస్టల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులను మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పని చేస్తుందని, వచ్చేసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా ముదిరాజులు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎంపీగా గెలిచానని, ఇక్కడ అభివృద్ధి చేసేందుకు తన వంతుగా సహకరిస్తానని తెలిపారు. గతంలో పదేండ్లు ఎంపీగా చేసిన అతను బీసీ లను పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా బీసీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, ముదిరాజ్ కుల పెద్దలు బాల్ రంగం, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బాసం గారి వెంక ట్ తదితరులు పాల్గొన్నారు.