
- సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ సమక్షంలో చేరిక
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరిని కాంగ్రెస్లో చేర్చుకునే అవకాశం ఉంది.