అడవిబిడ్డలకు అన్యాయం చేస్తే జైలుకు పంపిస్తా

అడవిబిడ్డలకు అన్యాయం చేస్తే జైలుకు పంపిస్తా

ఆదివాసీలకు అన్యాయం చేస్తే ఆఫీసర్లను జైలుకు పంపిస్తా

ఎంపీ సోయం బాపురావు

కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీ బిడ్డలు అమాయకులని, వాళ్లకేం తెలియదని ఆఫీసర్లు అనుకుంటున్నరేమో..  వాళ్లకు అండగా నేనున్నా. ఆదివాసీల జోలికి వచ్చి తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోను. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న ఆఫీసర్లను జైలుకు పంపిస్తానని ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపురావు అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్​ నియోజకవర్గం చింతలమానపల్లి మండలంలో ఆయన పర్యటించారు. పీఎంజీఎస్ వై కింద రవీంద్రనగర్ ​నుంచి గంగాపూర్​వరకు రూ.3 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హెడ్​క్వార్టర్​లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆదివాసీలంటే అమాయకులనే ఆలోచనతో అధికారులు, టీఆర్ఎస్​లీడర్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. 1/17 చట్టానికి తూట్లు పొడిచేలా ఏజెన్సీలో గిరిజనేతరులు, అధికారపార్టీ లీడర్లు భూములు ఆక్రమించి బంగ్లాలు కట్టడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. చింతలమానపల్లిలో టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధి, గిరిజనేతరుడు భూమి ఆక్రమించి స్కూల్​ బిల్డింగ్​కడుతున్నారని, ఈ బిల్డింగ్ కు ఆఫీసర్లు ఎట్లా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే నెల రోజుల్లో 50 మంది ఆదివాసీలను తీసుకొచ్చి బిల్డింగ్​కూలగొడతానని హెచ్చరించారు. ప్రకృతివనం జాగా విషయంలో 11 మంది ఆదివాసీలపై కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. కేసీఆర్​సర్కారు కేంద్రం డబ్బుతో సోకులు పడుతోందని.. రాష్ట్ర ప్రజల కోసం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ప్రధానమంత్రి మోడీ వద్ద రూ.1500 కోట్లు తెచ్చిన కేసీఆర్​ ఏ ఊళ్లోనూ ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ  జిల్లా అధ్యక్షుడు జేబీ.పౌడెల్, సిర్పూర్​ నియోజకవర్గ ఇన్​చార్జి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, జడ్పీ మాజీ చైర్మన్​సిడాం గణపతి, మన్నెవార్​ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారిపెల్లి పోశం, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి బ్రహ్మయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్​ తదితరులు పాల్గొన్నారు.

For More News..

16 ఏండ్లయినా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్ట్

కరోనా భయంతో కోటి జంతువులను చంపేస్తున్న డెన్మార్క్

తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు రూ.2.92 లక్షల ఫీజు