
- ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: మంచిర్యాలలో వందేభారత్ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ కల్పించడం పట్ల హర్షం ప్రకటిస్తూ ఆదివారం మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ఆఫీస్ వద్ద పార్టీ శ్రేణులు వేర్వేరుగా సంబురాలు జరుపుకున్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తెలంగాణా తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా వాసుల సౌకర్యార్థం వందేభారత్ రైలుకు హాల్టింగ్ కల్పించేందుకు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎంతో కృషి చేశారని లీడర్లు పేర్కొన్నారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి, దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు, రైల్వే బోర్డు చైర్మన్లను తరచూ కలుస్తూ రైలు హాల్టింగ్ కోసం ఎంపీ నిరంతర కృషి చేశారని, వారి పోరాటం ఫలితంగానే వందేభారత్కు మంచిర్యాలతో పాటు, కాగజ్ నగర్లోనూ హాల్టింగ్ ఇస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నేత సొతుకు సుదర్శన్, క్యాతనపల్లి టౌన్ ప్రెసిడెంట్పల్లె రాజు, మున్సిపల్మాజీ చైర్పర్సన్ జంగం కళ, తిరుమల రెడ్డి, ఎన్.శ్రీనివాస్, ఎండీ హఫీజ్, యూత్ కాంగ్రెస్ రామకృష్ణాపూర్ మండల ప్రధాన కార్యదర్శి మాయ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరులో ఐత హేమంత రెడ్డి, చెన్నూరు, కోటపెల్లి కాంగ్రెస్ అధ్యక్షులు బాపగౌడ్, మహేశ్ తివారీ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు కుర్మా రాజమల్ల గౌడ్, చెన్నూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణా, సుశీల్ కుమార్, అంక గౌడ్, మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.