
భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీకి ‘మిస్టర్ కూల్’ అని పేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి లోనవకుండా శాంతంగా ఆలోచిస్తాడు. టీం ఏలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రశాంతత కోల్పోడని అంటారు. అలాంటి ధోనీకి కూడా చెన్నై బౌలర్లు అసహనం కలిగించారు. దాంతో ఆగ్రహించిన ధోనీ చెన్నై బౌలర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెపాక్ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యా్చ్ లో చెన్నై బౌలర్లు ఎక్స్ ట్రాలు ఇస్తూ, లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయి పరుగులు ఇచ్చేశారు. దాంతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్ కాస్త చివరికి ఉత్కంఠంగా మారింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో ఏకంగా 18 పరుగులు ఇచ్చేశారు. అందులో 13 వైడ్ లు, 3 నోబాల్స్ ఉన్నాయి.
దీనిపై ధోనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మా బౌలింగ్ విభాగం చాలా మెరుగుపడాలి. ఎక్స్ ట్రాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది ఎప్పటికైనా టీంకు పెద్ద దెబ్బ. బౌలర్లు నో బాల్స్, వైడ్లు వేయడం తగ్గించుకోవాలి. ఇది ఇలానే జరిగితే వాళ్లు మరొకరి కెప్టెన్సీలో ఆడాల్సి వస్తుంద’ని నవ్వుతూనే హెచ్చరించారు.