
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తను చదివిన ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి (ఐసీటీ) రూ.151 కోట్ల షరతులు లేని గ్రాంట్ను ప్రకటించారు. ఆయన1970లలో ఐసీటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. తన అభిమాన ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర 'డివైన్ సైంటిస్ట్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఆయన శుక్రవారం ఐసీటీకి వచ్చారు. అక్కడే మూడు గంటలకు పైగా గడిపారు. యూడీసీటీ లో ప్రొఫెసర్ శర్మ ఉపన్యాసం తనను ఎలా ప్రేరేపించిందో, ఆయన భారతదేశ ఆర్థిక సంస్కరణల కోసం ఎంత కృషి చేశారో వివరించారు. భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏకైక మార్గం లైసెన్స్- పర్మిట్- రాజ్ నుంచి పరిశ్రమలను విడదీయడమేనని శర్మ వాదించేవారు.
ఇది భారతీయ పరిశ్రమలు స్థాయిని పెంచుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా పోటీపడటానికి వీలు కల్పిస్తుందని పేర్కొనేవారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీలాగే, ఆయనకూ భారతీయ పరిశ్రమ ప్రపంచానికి నాయకత్వం వహించేలా మార్చాలనే తీవ్రమైన కోరిక ఉందని అంబానీ అన్నారు. భారత రసాయన పరిశ్రమ వృద్ధికి శర్మ చేసిన కృషిని మెచ్చుకుంటూ ఆయనను 'దేశ గురువు' అని అభివర్ణించారు. శర్మ సూచనల ప్రకారం అంబానీ ఐసీటీకి రూ. 151 కోట్ల బేషరతు గ్రాంట్ను ప్రకటించానని వెల్లడించారు.