రెండు గంటలపాటు చర్చించిన ఇరువురు
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం జగన్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, విద్య, వైద్యరంగాల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో రిలయన్స్ తరఫున భాగస్వామ్యంపై చర్చించారు. శనివారం మధ్యాహ్నం కొడుకు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముకేశ్ అంబానీకి ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసంలో ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి, పెట్టుబడులు ఇతర అంశాలపై 2 గంటలకుపైగా చర్చలు జరిపారు. ఇటీవల విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం నాడు–నేడు కింద చేపట్టిన కార్యక్రమాల్లో రిలయన్స్ భాగస్వామ్యంపైనా చర్చించారు. ముకేశ్ అంబానీతో కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా చర్చల్లో పాల్గొన్నారు.