ఆదిలాబాద్ లో పోలీసులు, అటవీ శాఖ అధికారులపై ముల్తానీల దాడి

ఆదిలాబాద్ లో పోలీసులు, అటవీ శాఖ అధికారులపై ముల్తానీల దాడి
  • ఎస్సైతో సహా పలువురికి గాయాలు, రిమ్స్​కు తరలింపు
  • పోలీస్  వెహికల్​ ధ్వంసం
  • పోడు భూముల్లో మొక్కలు నాటవద్దని వాగ్వివాదం
  • ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్  జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కవ్వాల్  టైగర్​ రిజర్వ్(కేటీఆర్) పరిధిలోని 71, 72  కంపార్ట్​మెంట్లలో ఆదివారం ఉదయం మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్​ అధికారులు, పోలీసులను ముల్తానీలు అడ్డుకున్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటుతుండగా, అధికారులతో ఘర్షణకు దిగారు. మొక్కలు నాటనిచ్చేది లేదని జేసీబీని అడ్డుకొని పోలీస్, ఫారెస్ట్​ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. 

ఈ దాడిలో పోలీసులు, ఫారెస్ట్​ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. గుంపులుగా వచ్చి కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్ద ఎత్తున రాళ్లు విసరడంతో పొలాల్లో నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ దాడిలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంతో పాటు పలువురు పోలీసులు, ఫారెస్ట్​ సిబ్బందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఇచ్చోడ పీహెచ్​సీ, ఆదిలాబాద్​ రిమ్స్  హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్  మహాజన్  ఇచ్చోడ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. దాడులకు కారణమైన వారి వివరాలు సేకరించారు.

ఉద్రిక్త వాతావరణం..

గత కొన్నేళ్లుగా కేశవపట్నంలో ముల్తానీలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేవని, ప్రతి ఏడాది చెట్లు నరికి భూములు సాగు చేస్తున్నారని ఫారెస్ట్  అధికారులు చెబుతున్నారు. వనమహోత్సవంలో భాగంగా వారం రోజులుగా మొక్కలు నాటుతుండగా, రాత్రికి రాత్రే వాటిని తొలగించేస్తున్నారని కేటీఆర్​ ఎఫ్ఆర్వో నాగస్వామి తెలిపారు. ఆదివారం పోలీస్​ బందోబస్తు మధ్య మొక్కలు నాటుతుండగా, తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు.

కలప స్మగ్లింగ్​కు కేరాఫ్.. 

కేశవపట్నం గ్రామాన్ని కలప స్మగ్లింగ్ కు కేరాఫ్ గా చెప్పుకుంటారు. ఒకప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలంటే వెనకడుగు వేసేవారు. రెండు, మూడేళ్ల నుంచి పోలీసుల సహకారంతో ఫారెస్ట్​ అధికారులు గ్రామంలో తనిఖీలు చేస్తున్నారు.  గత జనవరిలో సైతం పోలీసులు, ఫారెస్ట్​ ఆఫీసర్లు కలప కోసం తనిఖీలు చేయగా గ్రామస్తులు దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. తాజాగా ఆదివారం సైత ముల్తానీల దాడుల్లో పోలీసులు, ఫారెస్ట్​ సిబ్బంది తలలు పగిలాయి.