
- బల్దియా అనుమతులు లేకుండానే పార్క్లో నిర్మాణాలు
- రోడ్డు వైపు దాబా ఏర్పాటు చేసి హోటల్ బిజినెస్
- సాయంత్రం, వీకెండ్స్లో ఎంట్రీ టికెట్ రూ.20కి బదులు రూ.50 వసూలు
- ఫుట్పాత్పై పార్కింగ్ కు ఫీజు వసూలు
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నడిబొడ్డున నిర్మించిన మల్టీ పర్పస్ పార్క్ పక్కా కమర్షియల్గా మారిపోయింది. పార్క్ మెయింటెనెన్స్ కోసం టెండర్లో దక్కించుకున్న కాంట్రాక్టర్.. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం, బల్దియా అనుమతులు లేకుండానే దాబా ఓపెన్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ సిటీ సెంటర్లో పార్క్ ఉండడం, పిల్లలు, పెద్దలు ఇందులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో ఇదే అదనుగా అందినకాడికి దోచుకునేలా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారు. పార్క్కు సంబంధం లేని స్థలంలో ఫుట్పాత్, రోడ్లపై టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ పార్కింగ్ చేయిస్తూ ఫీజు వసూలు చేస్తున్నారు. వీకెండ్స్ శనివారం, ఆదివారం ఎంట్రీకి డబుల్ చార్జీలు వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రూ.11 కోట్లతో నిర్మాణం..
కరీంనగర్ ప్రజల ఆహ్లాదం కోసం తెలంగాణ చౌక్ సమీపంలో ఏడెకరాల విస్తీర్ణంలో మల్టీ పర్పస్ పార్కును రూ.11 కోట్లతో నిర్మించారు. ల్యాండ్స్కేప్, లైటింగ్, ఈపీడీఎం ఫ్లోరింగ్తో కూడిన వాకింగ్ట్రాక్, చిల్డ్రన్ప్లే ఏరియా, సీటింగ్, వాకింగ్ బారెల్, రోటో క్రౌల్ ట్యూబ్, స్లైడ్ రోటో వేవ్, కేమల్ స్ర్పింగ్రైడర్, మ్యూజికల్వాటర్ ఫౌంటెన్, యాంఫి థియేటర్ సౌకర్యాలు కల్పించారు. ప్రజల నుంచి నామమాత్రపు ఫీజులతో పార్క్ను నిర్వహించాల్సి ఉండగా.. పార్క్ స్పేస్ను పూర్తిగా వ్యాపారమయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంట్రీ నుంచి చివరి వరకు ప్రతిచోటా బాదుడే..
పార్కులో ఎంట్రీకి బల్దియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.20 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కొక్కరికి రూ.30, ప్రతి రోజూ సాయంత్రం, వీకెండ్స్లో రూ.50 వసూలు చేస్తున్నారు. పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేసిన వివిధ ఆటలకు కూడా పైసలు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న పిల్లల బోటింగ్కు రూ.50, ఎలక్ట్రిక్ బైక్ రైడింగ్ కు రూ.100, ట్రాంపొలైన్ జంపింగ్ కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే ఫుట్ పాత్, పక్కనే ఉన్న రోడ్డును పార్కింగ్ జోన్ గా మార్చేశారు. అక్కడ పార్కింగ్ చేసే టూ వీలర్, ఫో వీలర్ వెహికల్స్ నుంచి రూ.20, రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు.
పర్మిషన్ లేకుండానే పనులు
మల్టీపర్పస్ పార్క్లో ఫుడ్ కోర్టు ఇప్పటికే ఉన్నప్పటికీ.. ఎలాంటి అనుమతుల్లేకుండా రోడ్డు వైపు పార్క్ ప్రహరీని కూల్చి ఇటీవల దాబా ఏర్పాటు చేశారు. ఇందులో 50 మంది వరకు కూర్చునేలా సీటింగ్ అరెంజ్ మెంట్ చేసి హోటల్ బిజినెస్ నడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా దాబా
పార్క్ పరిధిలో కేవలం క్యాంటీన్ ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఉంది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ షరతులను ఉల్లంఘించి హోటల్/దాబా ను ఏర్పాటు చేసింది. అనధికారంగా ఏర్పాటు చేసిన దాబాను తొలగించాలని నిర్వాహకులను ఆదేశించాం. -ప్రఫుల్ దేశాయ్, కమిషనర్, కరీంనగర్ బల్దియా