అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

నిర్వహణ పనుల కారణంగా అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్టు 6 గంటల పాటు మూతపడనుంది. ఈ మేరకు ముంబై విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. 

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో ఎయిర్ పోర్టు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షాకాలం తరువాత ఉన్న రెండు రన్‌వేల వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా  అక్టోబర్ 17న రెండు రన్‌వేలను ఆరు గంటల పాటు మూసివేయనున్నారు. సురక్షితమైన, సమర్థవంతమైన విమాన కార్యకలాపాలను నిర్వర్తించడంలో భాగంగానే ప్రతి ఏటా ఇలా చేస్తారు. 

"నిర్వహణ ప్రణాళికలో భాగంగా RWY 09/27, RWY 14/32 రన్‌వేలు 17 అక్టోబర్ 2023న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తాత్కాలికంగా పనిచేయవు.." అని విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఆరు నెలల ముందుగానే ఎయిర్‌మెన్‌కు నోటీసు (NOTAM) కూడా జారీ చేసినట్లు విమానాశ్రయం తెలిపింది.

ఈ విమానాశ్రయం నుండి రోజుకు దాదాపు 900 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.